Saturday 4 May 2024

శ్రీ గరుడ పురాణము (165)

 


మేఘంలో పుట్టే ముత్యాలు భూగోళం దాకా రానే రావు. ఖేచరులైన దేవతలే వాటిని ఒడిసి పట్టేసుకుంటారు. ఆ ముత్యాలకి దిక్కుల మూలల్లోని చీకట్లను కూడా పారద్రోలి అంతవఱకు మనకి కనిపించని చీకటి కోణాలని ఆవిష్కరించేటంత తేజస్సుంటుంది. సూర్య సమాన కాంతులతో ప్రకాశించే ఆ ముత్యం ఆకారం కూడా స్పష్టంగా ఆ వెలుగులో కనిపించడం కష్టం. ఈ మేఘమణి సర్వజన సామాన్యానికీ సమస్త శుభదాయకం. ఈ మణి వున్న చోటి నుండి నలుదిక్కులూ సహస్రయోజనాల దాకా విస్తరించిన క్షేత్రంలో ఏ అనర్థమూ జరగదు.


దైత్యరాజు, మహాదాని బలాసురుని ముఖము నుండి రాలినదంత పంక్తి నక్షత్ర మండలంలాగా ఆకాశంలో ప్రకాశిస్తూ విచిత్ర వివిధ వర్ణకాంతులను వెలారుస్తూ అలా అలా సముద్రంలో పడింది. ఈ సముద్రం అప్పటికే అశేష జలరాశికే గాక అమూల్య రత్న సంపత్ ప్రపంచాధిపతి. సోముని యొక్క షోడశ కళలతో నిండిన వెలుగులను, కాంతిని, శాంతిని తలదన్నే రత్నాలకు ఆకారము ఆ చంద్రునికే పుట్టినిల్లు, రత్నగర్భయైన సముద్రము. సముద్రమే మహాగుణ సంపన్నాలైన సర్వరత్ననిధానము. అందులో పడిన బలాసురుని పలువరస ఒక కొత్త అమూల్య సంపదకు తెరతీసింది. ముత్యపు చిప్పగా అనంతర కాలంలో ప్రసిద్ధికెక్కిన శుక్తులలో ఈ పలువరుస వంశాభివృద్ధి జరుగుతోంది. ఈ ముత్యాలే సర్వశ్రేష్ఠములై మానవజాతిని సముద్దరిస్తున్నవి. సాగర తీర దేశాలు, ద్వీపాలునైన సౌరాష్ట్ర, పరలోక, తామ్రపర్ణ, పారశవ, కుబేర, పాండ్య, హాటక, హేమక, సింహళ ప్రాంతాలు ముత్యాలకు కోశాగారాలు (ఖజానాలు)గా పరిణతిచెందాయి.


ముత్యమెక్కడ పుట్టినా ముత్యమే. ఇది సర్వత్ర సర్వాకృతులలోనూ లభిస్తుంది. పురాణ కాలంలో ఒక ముక్తాఫలం విలువ ఒక వేయీ మూడు వందల అయిదు ముద్రలు. అరతులం బరువున్న ముత్యం పైన చెప్పిన ధరలో అయిదింట రెండవ భాగము (2/5) తక్కువ. మూడు మాశలు అధికంగా బరువుండే ముత్యము. రెండువేల ముద్రలు. అనంతర కాలంలో విలువలు ఈ దిగువ కలవు.


(ఈ ధరవరుల పట్టిక క్రిందటి శతాబ్దిది. విష్ణువు గాని సూతుడు గాని చెప్పినది కాదు)


పూర్తిగా పెరిగిన పెద్ద పరిమాణంలో వున్న చిప్ప నుండి వచ్చిన ముత్యం పదమూడు వందల బంగారు కాసుల (సావెరిన్ల) ధర పలుకుతుంది. ఆరు బియ్యపు గింజల బరువున్నది 460 కాసులు చేస్తుంది. అత్యుత్తమ స్థాయికి చెంది, తొమ్మిది గింజల బరువున్న ముత్యం ధర రెండు వేల కాసులుంటుంది. రెండున్నర గింజల బరువున్నది 1300 కాసులు, రెండు గింజల బరువున్నది 800 కాసుల విలువ చేస్తాయి. అరగింజ బరువే వుండి మూడువందల కాసుల ఖరీదు చేసే ముత్యాలు కూడా వున్నాయి. ఉత్తమస్థాయికి చెంది, 720 మిల్లిగ్రాముల బరువుండే ముత్యం వెల రెండు వందల కాసులు. ద్రావిక అను పేరు గల శ్రేష్ట ముత్యమొకటుంది. దీని బరువు 50 మిల్లి గ్రాములు వెల 110 కాసులు. భావకమను పేరు గల ముత్యం 35 మిల్లిగ్రాములు, ధర 97 కాసులు. శిక్య అని చిన్న ముత్యాలుంటాయి. అవైతే ఒక్కొక్కటి పాతిక మిల్లిగ్రాముల బరువు, 40 కాసుల ధర. సోమ ముత్యము 15 మిల్లిగ్రాములు, 20 కాసులు. అలాగే కుప్యా అనే రకానికి చెందిన ముత్యం 8 లేక 9 మిల్లిగ్రాముల బరువుండి తొమ్మిది లేదా పదకొండు కాసుల ధర పలుకుతుంది. (కాసులనగా బంగారుకాసులైన సావెరిన్లే)


Friday 3 May 2024

శ్రీ గరుడ పురాణము (164)

 


వెదురు, ఏనుగు, చేప, శంఖం, వరాహాల నుండి వచ్చే ముత్యాలు మంగళకరమైన కార్యాలకు ప్రశస్తములని చెప్పబడింది. రత్ననిర్ణాయక విద్వాంసులు ఎనిమిది రకాల ముత్యాలను పేర్కొంటూ వాటిలో శంఖ, హస్తి ప్రభూతాలు అధమాలని వచించారు.


శంఖం నుండి పుట్టిన ముత్యం ఆ శంఖము యొక్క మధ్యభాగం రంగులోనే వుండి బృహల్లోల ఫలం పరిమాణంలో వుంటుంది. ఏనుగు కుంభస్థలం నుండి వచ్చే ముత్యం పసుపురంగులో వుంటుంది. వీటి ప్రభావం ఏమీ వుండదు. చేప నుండి పుట్టే ముత్యాలు ఆ చేపపై భాగం రంగులోనే వుంటాయి. అందంగా, గుండ్రంగా, చిన్నవిగా ఉంటాయి. సముద్రంలోనే ఎక్కువ భాగం జీవించే చేప యొక్క వదన భాగం ఈ ముత్యాల జనకస్థానం.


వరాహం నుండి వచ్చే ముత్యాలు ఆ వరాహం దంత మూలాల రంగులోనే వుంటాయి. అయితే ఈ వరాహాలు మనకెప్పుడూ దర్శనమిచ్చే నల్ల ఊరపందులు కావు. ముక్తాజనకమైనది ఎక్కడో ఎప్పుడో అరుదుగా దొరికే శ్వేతవరాహరాజము.


వెదురు కణుపుల నుండి పుట్టే ముత్యాలు వడగళ్ళలాగ స్వచ్ఛ సముజ్జ్వల తెలుపు మెరుపుల కాంతులతో శోభాయమానంగా వుంటాయి. ఈ ముత్యాలకు జన్మనిచ్చే వెదుళ్ళు ఎక్కడో దివ్య, జనులను సేవించుకోవడానికి వారున్నచోటనే పుడతాయి గాని సామాన్యులకు దొరకవు.


సర్పముత్యాలు కూడా చేప ముత్యాల వలెనే విశుద్ధంగా వృత్తాకారంలో వుంటాయి. కత్తుల చివరల కాంతుల వలె అద్భుతంగా మెరుస్తాయి. పాము పడగలపై, అదీ అత్యున్నత జాతి నాగుల వద్దనే, దొరికే ఈ ముత్యానికి గొప్ప శక్తి వుంటుంది. దీనిని ధరించేవాడు అతిశయ ప్రభాసంపన్నుడై, రాజ్యలక్ష్మీయుక్తుడై, దుస్సాధ్యమైన ఐశ్వర్యానికధిపతియై తేజస్విగా, పుణ్యవంతునిగా వెలుగొందుతాడు.


ఈ ముత్యాన్ని రత్నశాస్త్రంపై ప్రపంచంలోనే సంపూర్ణ అధికారమున్న విద్వాంసుని చేత పరీక్ష చేయించి ఆయన తలయూచిన పిమ్మట శుభముహూర్తంలో నొక సమస్త విధి పూర్వక సంపన్నమైన భవనంపై స్థాపిస్తే ఆకాశం నుండి దేవదుందుభి ధ్వని వినిపిస్తుంది. దేవతల సంతోషం, ఆశీర్వాదం స్పష్టంగా తెలుస్తాయి. ఎవని కోశాగారంలోనైతే ఈ సర్ప ముత్యంవుంటుందో వానికి సర్ప, రాక్షస, వ్యాధి, ప్రయోగాల ద్వారా మృత్యు భయముండదు.


Thursday 2 May 2024

శ్రీ గరుడ పురాణము (163)


 

పుష్పరాగాది జాతిరత్నాలు ఇతర జాతిరత్నాలపై గీతను గీయగలవు. కాని హీరకము, కురువిందము (మాణిక్యం) తమ జాతి రత్నాలనే గీయగలవు.


వజ్రాన్ని వజ్రమే కోయగలదు. స్వాభావిక వజ్రానికి మాత్రమే తన కాంతులను పైపైకి అనగా ఆకాశదిశగా ప్రసరింపజేసే శక్తి వుంటుంది.


ఇంద్రాయుధ చిహ్నంకితములైన వజ్రాలు కొన్ని అరుదుగా వుంటాయి. వీటిపై ఆ గుర్తు స్పష్టంగానే కనిపిస్తుంటుంది. కేవలం ఇవి మాత్రమే... కోణాల వద్ద విరిగినా, బిందు, రేఖా చిహ్నదూషితాలైనా తమ శ్రేష్టతను పూజ్యతను నిలబెట్టుకొనే వుంటాయి. అనగా వీటిని ధరిస్తే నష్టం జరుగకపోగా ఉద్దిష్ట ప్రయోజనాలన్నీ నెరవేరుతాయి.


మెరుపుతీగలలోని కాంతితో సముజ్జ్వలంగా వెలుగులను విరజిమ్మే వజ్రాలను ధరించే రాజు అతిశయ ప్రతాపవంతుడై జగదేకవీరుడై విలసిల్లగలడు. సమస్త సంతానాలతో వర్ధిల్లుతూ పెద్ద కాలముపాటు పుడమి నేలగలడు. (అధ్యాయం - 68)


ముత్యాలు - వాటిలో రకాలు లక్షణాలు - పరీక్షణ విధి


శ్రేష్ఠమైన ఏనుగు, మేఘం, వరాహం, శంఖం, చేప, పాము, వెదురు - వీటన్నిటి నుండీ ముత్యాలు వస్తాయి. అయినా శుక్తి అనగా ముత్యపు చిప్ప నుండి పుట్టు ముత్యాలే జగత్ప్రసిద్ధాలు.


రత్నమనిపించుకొనే స్థాయి ఒకే ఒక రకమైన ముత్యానికుంటుందని ముక్తాశాస్త్రం ఇది వివరిస్తోంది. అది ముత్యపు చిప్పలోనేపుడుతుంది. ఇదే సూదితో పొడిస్తే కన్నం పడుతుంది. మిగతావి పడవు.


Sunday 28 April 2024

శ్రీ గరుడ పురాణము (162)

 


ఏ దోషమూ లేకుండా, ఇరవై బియ్యపుగింజల బరువుండే వజ్రం మిగతా వజ్రాల కంటె రెట్టింపు ధర పలుకుతుందని మణిశాస్త్ర పండితులంటారు. పరిమాణం, మూడోవంతు, సగభాగం, నాలుగోవంతు, పదమూడవ వంతు, ముప్పదవ, అరువడవ, సూరవ, వెయ్యవ వంతున్న వజ్రాలు అలాగే పైన చెప్పిన వజ్రం కంటే అధిక భారమున్న వజ్రాలు కూడా వుంటాయి. వాటి విలువ వాటి బరువును బట్టే వుంటుంది. ఇక్కడ బియ్యపుగింజ కూడా ప్రత్యేకమైనది వుంటుంది. దాని బరువు ఎనిమిది ఎఱ్ఱ ఆవగింజల బరువుతో సమానమై వుండాలి.


ఏ దోషమూ లేని వజ్రాన్ని నీటిలో వేస్తే మునగదు, పైగా ఈతకొడుతున్నట్లుగా తేలుతూ అడుతుంది. అది రత్నాలన్నిటిలో సర్వశ్రేష్టము. దానిని ధరించుట శుభకరము.


దోషాలు దొరుకుతున్న కొద్దీ దానికి విలువ తగ్గిపోతుంటుంది. వాటిని కొని ధరించడం వల్ల నష్టం జరగవచ్చు. కొన్ని వజ్రాలు కాలక్రమాన దోషయుక్తాలవుతాయి. రాజు వాటిని వెంటనే ధరించడం మానివేయాలి. ఇతరులు ధరించవచ్చని కాదు కానీ ఆ వజ్రానికున్న శక్తి తగ్గిపోతుంది. రాజు అలాంటి వాటిని పెట్టుకోవడం కొనసాగిస్తే రాజ్యానికి మంచిది కాదు.


పుత్రాపేక్షతో వజ్రాన్ని ధరించే స్త్రీ ఇతరుల వలె రత్న శాస్త్రపారంగతుని మాత్రమే కాక తనకు అలవాటైన జాతకరత్నను కూడా సంప్రదించి ఆ పని చేయాలి. దోషయుక్తమైన రత్నాలను ధరించుటే దోషము. ఇక దాని వలన మంచి జరగాలనుకోవడం మృగతృష్ణలో నీరు త్రాగాలనుకోవడమే. వజ్రాల విషయంలో మోసం జరిగే అవకాశాలెక్కువ కాబట్టి కూలంకష పరీక్ష మిక్కిలిగా అవసరమౌతుంది. నకిలీలు ఎక్కువ మెరుపును కలిగి వుంటాయి. కాని ఆ మెరుపు ఎంతో కాలముండదు కాని అప్పటికే ఆలస్యమైపోయి జరగవలసిన కీడు జరిగిపోతుంది.


క్షారద్రవ్యం ద్వారా, శాస్త్రోల్లేఖిత పద్ధతుల ద్వారా, శాణ ప్రయోగంతో వజ్రాలను పరీక్షించాలి. ఈ భూమిపై నున్న అన్ని రత్నాలపై లోహాది ఇతర ధాతువులపై వజ్రం గీత పెట్టగలదు. కాని వజ్రంపై గీతను పెట్టడం దేనికీ సాధ్యం కాదు, ఒక్క వజ్రానికి తప్ప.


Saturday 27 April 2024

శ్రీ గరుడ పురాణము (161)

 


వర్ణసాంకర్యం రత్నాల విషయంలో కూడా మంచిది కాదు. పైగా దుఃఖదాయిని. రంగును చూసి అంతమాత్రాననే తృప్తిపడిపోయి రత్న సంచయాన్ని చేయరాదు. అంటే అటగా ఇంటికి తెచ్చేసుకోకూడదు. ఎందుకంటే దోషయుక్త రత్నాలు ఇంటికి హానిని చేస్తాయి. మంచి గుణాలున్న రత్నాలైతేనే ఇంటికీ అందులోని వ్యక్తుల వంటికీ ఆరోగ్యాన్నీ ధనాన్నీ తేగలవు. వజ్రాన్ని జాగ్రత్తగా చూసి ఎక్కడా పగులుగాని, కొమ్ముల వద్ద విరుగుగానీ, బీటలుగాని లేకుండా వుంటేనే తేవాలనే ఆలోచన పెట్టుకొని తదుపరి గుణాలను పరీక్షించాలి.


కోణాలు సూదిగా మొనదేలినట్లుండాలి, అగ్గిలో పుటం పెట్టి అప్పుడే తీసినట్లే ఎప్పుడు చూసినా వుండాలి, మరకలుండకూడదు. ఒకవైపు గాని, మొనల్లో గాని దెబ్బతిని పోయి, పొడిరాలుతున్న వజ్రాన్ని ధరిస్తే స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినవాడైనా సరే శీఘ్రం మృత్యువు నోట పడిపోతాడు. మధ్యలో బిందు చిహ్నాలు, నీటి చుక్కల వంటి ఆకారాలు కనబడే వజ్రాన్ని ధరిస్తే ఇంద్రుడంతటి వాడైనా దరిద్రుడైపోతాడు.


ఖానిక అనగా గని నుండి వచ్చిన షట్కోణ, అష్టకోణ, ద్వాదశకోణ, షట్పార్శ్వ, పార్శ్వ, ద్వాదశపార్య, షడ్ధారా, అష్టధారా, ద్వాదశధారా, ఉత్తుంగ, సమ, తీక్ష్ణాగ్ర- వంటి గుణాలు వజ్రాల సహణగుణాలు.


షట్కోణ, విశుద్ధ, నిర్మల, తీక్ష ధారగల, లఘు, సుందర పాఠ్య భాగములున్న నిర్దోష (నిర్దుష్ట)మైన ఇంద్రుని వజ్రాయుధ లక్షణాలున్న వజ్రమొకటి అంతరిక్షంలో నున్నదని, అది సర్వోత్కృష్టమని దానిని భూమిపైకి తేవడం కష్టసాధ్యమని విద్వాంసులు చెబుతుంటారు.


తీక్ష, నిర్మల, దోష శూన్య వజ్రాన్ని ధరించేవాడు తన జీవనపర్యంతమూ ప్రతిదినమూ స్త్రీతో భోగించగలడు; సంపద, పుత్ర, ధన-ధాన్య, పశుసంపదలు నిత్యం వృద్ధి చెందుతుండగా బహుకాలం సుఖంగా జీవిస్తారు. వానిపై ఎవరైనా సర్ప, విష, వ్యాధి, అగ్ని, జల, తస్కరాది ఆయుధాలను పంపినా, అభిచారమంత్రోచ్చాటనాది ప్రయోగాలను చేసినా అవి వానిని చూసి దూరం నుండే పారిపోతాయి. వానినేమీ చేయలేవు. కొన్ని ప్రత్యాగమితాలై పోతాయి. అంటే ప్రయోగించిన వాని పని పడతాయి.


Friday 26 April 2024

శ్రీ గరుడ పురాణము (160)

 


బలాసురుని ఎముకలు ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్కడ అవి వజ్రాలుగా నానా రూపాలలో ఏర్పడ్డాయి. హిమాచల, మాతంగ, సౌరాష్ట్ర, పౌండ్ర, కళింగ, కోసల, వేణ్వాతట, సౌవీర అను పేర్లు గల ఎనిమిది భూభాగాలు వజ్రక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. హిమాలయంలో పుట్టిన వజ్రాలు తామ్రవర్ణంలోనూ; వేణుకాతటంలో ప్రాప్తించినవి చంద్ర సమాన శ్వేతకాంతులలోనూ; సౌవీర దేశంలో లభిస్తున్నవి నీలకమల, కృష్ణమేఘ వర్ణంలోనూ; సౌరాష్ట్ర ప్రాంతీయ వజ్రాలు తామ్రవర్ణంలోనూ, కళింగ దేశీయ వజ్రాలు బంగారు రంగులోనూ వెలుగులను విరజిమ్ముతూ వుంటాయి. ఈ కోవలోనే చెప్పుకోతగ్గ కోసల దేశీయ వజ్రాల వర్ణం పసుపు పచ్చ కాగా పుండ్ర దేశీయ వజ్రాలు శ్యామల వర్ణంలోనూ మతంగ క్షేత్రపు వజ్రాలు లేత పసుపు రంగులోనూ వుంటాయి.


ఒక కొన్ని ప్రత్యేక లక్షణాలున్న వజ్రంలో నిత్యం ఎవరో ఒక దేవత నివసిస్తుండడం జరుగుతుంది. అత్యంత క్షుద్ర వర్ణం అంటే ఒక రంగు ఉందని అనిపిస్తుంటుంది గాని అది ఏ రంగో తెలియనంత లేత రంగు తొలి లక్షణం. ప్రక్కలలో స్పష్టంగా కనిపించే రేఖ, బిందు మాత్రం నలుపు కాక పదక (కాకి పాదం), త్రాసదోషరాహిత్యం, పరమాణువంత తీక్షమైన ధార - ఈ లక్షణాలు దేవవాస వజ్రానివి.


వజ్రం యొక్క రంగుని బట్టి అందులో ఏ దేవతలుంటారో శాస్త్రంలో వుంది. ఆకుపచ్చ తెల్ల, పచ్చ, పింగళ, నల్ల, రాగి రంగుల వజ్రాల్లో క్రమంగా విష్ణువు, వరుణుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, మరుత్తులు ప్రతిష్టితులై వుంటారు.


ఏయే వర్ణాల వారికేయే రంగుల వజ్రాలు (ధరించుటకు) ప్రశస్తమో కూడా శాస్త్రంలో చెప్పబడింది. బ్రాహ్మణులకు శంఖ, కుముద, లేదా స్పటిక సమాన శుభ్ర వర్ణమున్న వజ్రాలు ప్రశస్తం. క్షత్రియులు శశ (చంద్ర) వర్ణం లేదా బభ్రు- ధూర వర్గాలు లేదా కనుపాపల రంగులో నుండు వజ్రాలను ధరించడం మంచిది. వైశ్యులు కుంకుమ లేదా లేత అరిటాకు రంగులో వున్న వకాలను పెట్టుకోవాలి. శూద్రులకు వెండి రంగులో నున్న వజ్రాలు శ్రేష్టం.


విద్వాంసులు రాజులకు ముఖ్యంగా రెండు రంగుల వజ్రాలు మిక్కిలి ప్రశస్తమనీ ఇవి మిగతా వర్ణాలకు అంతగా మేలు చేయవనీ చెప్తారు. జవావర్గం (ఎరుపులో ఒక రకం?), పగడ సమాన రక్తవర్ణం కలిపి వున్న వజ్రం లేదా మామిడిపండు రసం వంటి పసుపు రంగు వజ్రం రాజులకు లాభదాయకం.



Thursday 25 April 2024

శ్రీ గరుడ పురాణము (159)

 


దేవతలు, యక్షులు, సిద్ధులు, నాగులు, ఆ బలాసురుని శరీరాన్ని ఆకాశమార్గంలో గొనిపోసాగినారు. ఆ యాత్రా వేగం వల్ల అతని శరీరం తనంతట తాను ముక్కలైపోయి పృథ్విపై అక్కడక్కడ పడినది.


సముద్రాల్లో, నదుల్లో, పర్వతాల్లో, వనాల్లో, మైదానాల్లో ఎక్కడెక్కడ రంచమాత్రమైనా (అత్యల్పపరిమాణం) ఆ మహాదాత శరీర శకలాలు పడ్డాయో, అక్కడక్కడ, రత్నాల గనులేర్పడ్డాయి. వాటి నుండి వెలికితీయబడిన రత్నాలకూ (వజ్రాలకూ) అద్భుత శక్తులున్నట్లు కనుగొనబడింది. రత్నాలలో వజ్రం, ముక్తిమణి, పద్మరాగం, మరకతం, ఇంద్రనీలం, వైదూర్యం, పుష్పరాగం, కర్కేతనం, పులకం, రుధిరం, స్పటికం, ప్రవాళం మొదలగు పేర్లతో ప్రత్యేక లక్షణాలతో ఇవి ప్రకాశిస్తున్నాయి. జ్ఞానపు ఆవలియొడ్డును చేరగలిగినంతగా తెలివిడి కలిగిన పారదర్శులు, విద్వజ్జనులు ఈ యీ రత్నాలకు ఆయా పేళ్ళను వాటి వాటి లక్షణాలను, కలిమి ఫలాలను కూలంకషంగా విశ్లేషించి వివేచించి పెట్టారు.


ఈ విద్వాంసులు ముందుగా రత్నం యొక్క ఆకారం, రంగు, గుణం, దోషం, పరీక్ష, మూల్యాదుల జ్ఞానాన్ని తత్సంబంధిత సర్వశాస్త్రాలనూ అధ్యయనం చేసి దాని ఆధారంగా శుభాశుభాలను నిర్ణయిస్తారు. ఈ అధ్యయనం అరకొరగా వుంటే అశుభాలు కలుగుతాయి. ఇక్కడొక విచిత్రమేమిటంటే తప్పుడు రత్నాన్ని ధరించినవారికే గాక ఆ రత్నాన్ని పెట్టుకొమ్మని సలహా ఇచ్చిన వారికి కూడ దుష్ఫలితాలు కలుగుతుంటాయి. కాబట్టి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన తరువాతనే రత్నశాస్త్రులయ్యే సాహసం చేయాలి.


ఐశ్వర్యాన్ని కోరుకొనేవారు గాని ఇతరులు గాని బాగా పరీక్ష చేయబడిన, అత్యంత శుద్ధమైనవిగా ధ్రువీకరింపబడిన రత్నాలనే ధరించాలి. రాజులైతే అట్టి రత్నాలను సంగ్రహించి వుంచాలి. కొన్నింటిని కాలానుగుణంగా ధరించాలి.


ఇక రత్న ప్రభావాల విషయానికొస్తే సర్వ ప్రథమంగా మహాప్రభావశాలిగా చెప్పబడుతున్న వజ్రం గురించి తెలుసుకోవాలి.